AP Crime News : నెల్లూరు అబ్బాయి, మధ్యప్రదేశ్ అమ్మాయి - ఓయో రూమ్ కేంద్రంగా గంజాయి దందా..!
ఈజీ మనీ కోసం ఓ అబ్బాయి, అమ్మాయి తప్పుదోవ పట్టారు. ఏకంగా ఓయో రూమ్ ను అడ్డాగా చేసుకుని గంజాయి దందాకు తెరలేపారు. పక్కా సమాచారం అందుకున్న ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. వారిని హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అబ్బాయిది నెల్లూరు జిల్లా… అమ్మాయిది మధ్యప్రదేశ్…! రాష్ట్రాలు, భాషలు వేరైనా ఇద్దరు మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. డబ్బు సంపాదన కోసం ఓయో రూమ్స్లో గంజాయి వ్యాపారం చేస్తూ పట్టుపట్డారు. వీరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఓయో కేంద్రంగా గంజాయి దందా..!
నెల్లూరు జిల్లా కావలికి చెందిన 20 ఏళ్ల దేవేందుల రాజుకు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల సంజన మాంజాతో హైదరాబాద్లో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరూ కలిసి డబ్బు సంపాదనే ధ్వేయంగా గంజాయి వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓయో రూములను కేంద్రంగా చేసుకుని గంజాయిని సరఫరా చేస్తున్నారు. గుట్టుగా సాగుతున్న వీరి గంజాయి వ్యాపారాన్ని ఎస్టీఎఫ్(స్పెషల్ టాస్క్ ఫోర్స్) పోలీసులు హైదరాబాద్ సమీపంలోని కొండాపూర్లో రట్టు చేశారు. కొండాపూర్లోని ఒక లాడ్జిలో ఉంటూ గంజాయి వ్యాపారాన్ని చేస్తున్న వీరిని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్టీఎఫ్ బృందం అదికారి నంద్యాల అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కావలికి చెందిన దేవేందుల రాజు, మధ్యప్రదేశ్కు చెందిన సంజనా మాంజాతో పరిచయం ఏర్పడింది. సులువగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి వ్యాపారం మొదలుపెట్టారు. అందుకు అనువుగా ఓయో రూమ్లను అద్దెకు తీసుకుని గంజాయిని విక్రయిస్తున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా కొండాపూర్లోని ఒక లాడ్జిలో ఉంటున్నారని సమాచారం వచ్చింది.
దీంతో శుక్రవారం రాత్రి ఎస్టీఎఫ్ బృందం దాడులు చేశాయి. వీరిని అదుపులోకి తీసుకుని, వీరి వద్దనున్న 1.2 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి అదనపు సమచారం రాబట్టేందుకు విచారణ జరుపుతున్నారు. అయితే దేవాదుల రాజు, సంజన మాంజా వేర్వేరు ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి హైటెక్ సిటీ, కొండాపూర్లోని స్థానిక వినియోగదారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
రైలులో డ్రగ్స్ - మహిళలు అరెస్ట్:
విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా షోలాపూర్కు రైలులో డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు మహిళలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు పట్టుకున్నారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ), రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో నిందితులు దొరికారు.
అరెస్ట్ అయిన వారిలో మధ్యప్రదేశ్కు చెందిన ఇష్రత్ బానో, ఛత్తీస్గఢ్కు చెందిన కంచన్లు ఉన్నారు. వారి నుండి రూ.4.4 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మధ్యప్రదేశ్కు చెందిన రాజా పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనే వ్యక్తికి ఈ ఇద్దరు మహిళలతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. వారి ఆర్థిక సమస్యలను పంచుకున్నారు. దీని తరువాత ఆంధ్రప్రదేశ్ నుండి మహారాష్ట్రకు గంజాయిని స్మగ్లింగ్ చేయడంలో సహాయం చేస్తే డబ్బు ఇస్తానని రాజు చెప్పాడు.
ఇందుకు ఇద్దరు మహిళలు అంగీకరించారు. వారి పథకం ప్రకారం జనవరి 16న విశాఖపట్నం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి రెండు బ్యాక్ప్యాక్లతో గంజాయిని ప్యాక్ చేసి సేకరించారు. జనరల్ కోచ్లో ఎక్కి శుక్రవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అనుమానం రావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం