ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన మహిళలు-a slight earthquake in prakasam district of ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన మహిళలు

ప్రకాశం జిల్లాలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన మహిళలు

తెలుగు రాష్ట్రాలను భూకంపాలు భయపెడుతున్నాయి. సోమవారం సాయంత్రం తెలంగాణలో భూకంపం రాగా.. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో సంభవించింది. దీంతో మహిళలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 5 సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు కూడా వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో భూకంపం (unsplash)

ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. కొత్తూరులోని రాజు ఆసుపత్రి వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలో ప్రకంపణలు వచ్చాయి. దీంతో మహిళలు ఇండ్లలోనుంచి పరుగులు తీశారు.

తెలంగాణలో..

తెలంగాణలోనూ సోమవారం సాయంత్రం భూమి కంపించింది. క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయి. భూకంపం రావడంతో భ‌యంతో ప్రజలు బ‌య‌టికి ప‌రుగులు తీశారు. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు అంటున్నారు. క‌రీంన‌గ‌ర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భ‌వ‌నాలు, ఇండ్లు కంపించాయి.

కారణాలు ఏంటి..

భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్లు కదలడం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భూకంపాలు సంభవిస్తున్నాయని.. నిపుణులు చెబుతున్నారు. ఈ ప్లేట్లు ఒకదానికొకటి రాసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా ఒకదాని కిందకి మరొకటి జారినప్పుడు, భూమిలో శక్తి విడుదల అవుతుంది. దీనివల్ల భూమి కంపించి భూకంపాలు వస్తాయని చెబుతున్నారు. భారతదేశం మొత్తం నాలుగు భూకంప మండలాలుగా విభజించబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్కువ ముప్పు ఉన్న జోన్ 2 లో ఉన్నాయి. అయితే.. కొన్ని ప్రాంతాలు జోన్ 3 లో కూడా ఉన్నాయి. ఇక్కడ మధ్యస్థ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతంలోనూ..

1969: ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది.

1998: తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 4.5 తీవ్రతతో భూకంపం సంభవించింది.

2013: హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.

2024: ములుగు జిల్లా మేడారంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

2025: కరీంనగర్, నిర్మల్.. ఇతర జిల్లాల్లో స్వల్ప భూకంపాలు వచ్చాయి.

భయపడవద్దు..

భూకంపాలు వచ్చినప్పుడు భయపడకుండా.. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. భయాందోళనకు గురైతే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఇంటి లోపల ఉంటే.. బల్ల లేదా డెస్క్ వంటి గట్టి వస్తువుల కిందకు వెళ్లి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను చేతులతో కప్పుకోవాలి. కిటికీలు, అద్దాలు, భారీ ఫర్నిచర్, గోడలకు దూరంగా ఉండాలి. భవనం పై అంతస్తులో ఉంటే, కింది అంతస్తుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. లిఫ్ట్‌ను ఉపయోగించవద్దు.

బయట ఉంటే..

బయట ఉంటే..భవనాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇతర ప్రమాదకరమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఓపెన్ ప్రదేశంలో ఉండటానికి ప్రయత్నించాలి. వాహనంలో ఉంటే, సురక్షితమైన స్థలంలో ఆపి, భూకంపం ఆగే వరకు వాహనంలోనే ఉండాలి. వంతెనలు, ఫ్లైఓవర్ల మీద వాహనం ఆపవద్దు.. అని నిపుణలు సూచిస్తున్నారు.

సంబంధిత కథనం