ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళి నాయక్.. మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు. పాక్ జరిపిన కాల్పుల్లో చనిపోయారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన శ్రీరామ్ నాయక్ కుమారుడు.. మురళీ నాయక్ మృతిచెందారు. మురళీ నాయక్ మరణవార్త విని కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
మురళీ నాయక్ మృతదేహం రేపటి వరకు అతని స్వస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. మొన్న లేదా నిన్న సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల సమయంలో మురళీ నాయక్ మరణించినట్టు తెలుస్తోంది. ముందు వరుసలో పనిచేస్తూ విధి నిర్వహణలో ఉండగా అతను మరణించాడని స్థానిక వర్గాలు నిర్ధారించాయి.
'దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు.
'జమ్ము కాశ్మీర్లోని యుద్ధభూమిలో సత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ మృతి తీవ్ర బాధ కలిగింది. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం మనకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తుంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. ఈ దుఃఖ సమయంలో మేము వారి కుటుంబానికి అండగా నిలుస్తాం' అని మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు.
'ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ.. మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన.. మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం' అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్ రూమ్కు ప్రత్యేక నెంబర్లు కేటాయించింది. 011-23387089, 9871999430, 9871999053, 9871990081, 9818395787 నంబర్లకు కాల్ చేస్తే.. సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రజలకు సహాయం అందించడానికి ఏపీ భవన్ కృషి చేస్తుందని.. సీఎం చంద్రబాబు వివరించారు.
సంబంధిత కథనం