రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అయ్యాయి. కీలక పనులకు టెండర్లను పిలవడానికి సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అటు కేంద్రం సహకారం, ఇటు బ్యాంకుల రుణాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి విస్తరణకు మరో 30 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.అమరావతి విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 30 వేల ఎకరాలను సేకరించాలని యోచిస్తోంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం, రింగ్ రోడ్లు వంటి భవిష్యత్ ప్రాజెక్టులకు తోడ్పడుతుంది. రాజధాని చుట్టూ భూ సేకరణపై సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది.
2.అమరావతి కోర్ క్యాపిటల్ వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూసేకరణ చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
3.అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు టెక్నో-ఫీజిబిలిటీ నివేదిక కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. సాంకేతిక నివేదికను త్వరగా రూపొందించి కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపనున్నారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చాక తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఎయిర్పోర్ట్ కోసం కొత్త సేకరించే భూమిలో స్థలాన్ని కేటాయించే అవకాశం ఉంది.
4.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ను నిర్మించాలని యోచిస్తోంది. ఇది దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటిగా ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 1500 ఎకరాల్లో దీన్ని నిర్మించే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాల కోసం దీనికి అదనంగా భూమిని కేటాయించే అవకాశం ఉంది.
5.రాజధాని అమరావతిలో ఇప్పటికే ప్రముఖ విద్యాసంస్థలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్నింటిని స్థాపించే అవకాశం ఉంది. వాటి స్థాపనకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేసి ఉంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
6.అమరావతి ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కోసం రాయితీ ధరలకు భూమిని కేటాయించే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిని కాకుండా.. కొత్తగా సేకరించిన దాంట్లో ఇవ్వాలని సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం.
7.రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో కొన్ని కొత్త నిర్మాణాలు చేపట్టాలని భావిస్తోంది. అందుకోసం చాలా భూమి అవసరం. అందుకే కొత్తగా భూసేకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది.
8.అమరావతిని ఒక ఐటీ హబ్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. వాటికి కూడా భూమి కొరత లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
9.కొన్ని నివేదికల ప్రకారం.. అమరావతిలో భూముల ధరలు పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఇక్కడ మరిన్ని కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం