ఒళ్లంతా తూట్లు.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు.. వీరయ్య చౌదరి హత్య కేసులో 8 సంచలన విషయాలు!-8 sensational facts in the murder case of tdp leader veeraiah chowdary ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఒళ్లంతా తూట్లు.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు.. వీరయ్య చౌదరి హత్య కేసులో 8 సంచలన విషయాలు!

ఒళ్లంతా తూట్లు.. ఒక్కో కత్తి పోటుకు రూ.2 లక్షలు.. వీరయ్య చౌదరి హత్య కేసులో 8 సంచలన విషయాలు!

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిరిన ఒప్పందంపై దృష్టి పెట్టారు. ఒప్పందంలో భాగంగా ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు అనే మాట హాట్ టాపిక్‌గా మారింది.

వీరయ్య చౌదరి (ఫైల్ ఫొటో)

ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరిని అత్యంత కిరాతకంగా చంపారు. ఒళ్లంతా తూట్లు పొడిచారు. ఈ మర్డర్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చాలా కిందటే మర్డర్ ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది. నిందితులు పక్కాగా రెక్కీ నిర్వహించి.. హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిరిన ఒప్పందం కీలకంగా మారింది. దీనికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

8 కీలక అంశాలు..

1.వీరయ్య చౌదరిని చంపడానికి 3 నెలల కిందటే నిందితులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. రెండు వారాల ముందే ఒంగోలు శివారులోని ఓ లాడ్జిలో మకాం వేసి... పక్కాగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన కుట్రదారుతో పాటు కీలక నిందితుడి కోసం హైదరాబాద్, విశాఖ ప్రాంతాల్లో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

2.వీరయ్య చౌదరి హత్య కేసులో అమ్మనబ్రోలుకు చెందిన వ్యక్తులే కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రేషన్‌ మాఫియా డాన్‌ ఇప్పటికే అదుపులో ఉన్నాడు. ఇదే మండలానికి చెందిన ప్రజా ప్రతినిధి భర్తనూ తీసుకెళ్లారు.

3.ఈ కేసులో కీలకమైన వ్యక్తి కోసం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. మొత్తం వ్వవహారంలో అతడే కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అన్ని రంగాల్లో వీరయ్య చౌదరికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఏకతాటిపైకి తెచ్చి.. హత్యకు ప్రేరేపించి, పథకం రచించి రేటు నిర్ణయించింది అతడేనన్న ప్రచారం జరుగుతోంది.

4.ఆ కీలకమైన వ్యక్తి హత్య జరిగేనాటికి హైదరాబాద్‌లో ఉండి, ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడనే ప్రచారం జరుగుతోంది. అతడు చిక్కితే అంతర్గత విషయాలన్నీ బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అతడి సన్నిహిత బంధువైన ఒకరిని పోలీసులు శ్రీశైలంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్టు సమాచారం.

5.ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి వైసీపీలోని కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

6.హత్య పాత్రధారుల్లో ముఖ్యమైన వ్యక్తి అదే రోజు విశాఖ వరకు వెళ్లి సెల్‌ఫోన్‌ ఆఫ్‌ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. నిందితులు త్రోవగుంట సమీపంలోని ఓ లాడ్జిలో మకాం వేసి, వీరయ్యచౌదరి రోజువారీ కదలికపై దృష్టి సారించి, రెక్కీ నిర్వహించినట్లు సమాచారం.

7.హైదరాబాద్‌ పరిసరాల్లో ఉంటున్నట్లు భావిస్తున్న సూత్రధారి, హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఒంగోలు యువకుడు ఇప్పటికీ దొరకలేదు. వీరు చిక్కితే హత్యకు దారితీసిన కీలక సమాచారం, ప్రత్యక్షంగా పాల్గొన్న మిగిలిన నిందితుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

8.వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న నిందితుల ఆచూకీని గుర్తించేందుకు.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులు దొరికారు. మిగతా ఇద్దరిని అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

సంబంధిత కథనం