Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు… పలువురి మృతి
Road Accidents తెలుగు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో ఆదివారం అర్థరాత్రి హోర ప్రమాదం జరిగింది. చెరకు ట్రాక్టర్ను ఆర్టీసి బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వైయస్ఆర్ జిల్లా కడప సమీపంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి.
Road Accidents వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని ముమ్మాళ్లపల్లి వద్ద జాతీయరహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. చెరకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను వెనక నుంచి ఆర్టీసి గరుడ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు మరో 16 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
మియాపూర్ డిపోకు చెందిన గరుడ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ముగ్గురు బస్సులో ప్రయాణిస్తున్నారు. మృతుల్లో డ్రైవర్, క్లీనర్తో పాటు మరో ప్రయాణికుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్లో వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో ముమ్మాళ్లపల్లి నుంచి అమడబాకుల వరకు నాలుగు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది
అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా…..
అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న రాజమండ్రి భక్తుల బస్సు వైఎస్సార్ జిల్లాలో బోల్తా పడటంతో నలుగురికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరం జిల్లా గోపవరం మండలానికి చెందిన 28 మంది అయ్యప్ప భక్తులు ఈ నెల 18న ప్రైవేట్ బస్సులో శబరిమలకు బయలుదేరారు.
మార్గ మధ్యంలో శ్రీశైలం, మహానంది చూసుకుని శబరిమల వెళ్తుండగా ఆదివారం ఉదయం వైయస్ఆర్ జిల్లా కడప సమీపంలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు మలుపు వద్దకు రాగానే బస్సులో డీజిల్ అయిపోయింది. డ్రైవర్ విషయాన్ని భక్తులకు చెప్పడంతో అందరు కిందకు దిగిపోయారు. బస్సు వెనక్కి రాకుండా రాళ్లు అడ్డు పెట్టాడు. డ్రైవర్ మలుపు వద్ద కాకుండా కాస్త కిందికి తీసుకొచ్చి పెట్టాలని బస్సును స్టార్ట్ చేశారు.
హ్యాండ్ బ్రేక్ పని చేయక పోవడంతో బస్సును నియంత్రించ లేకపోయాడు. బస్సు వెనకకు వస్తూ బోల్తా పడింది. రోడ్డు పక్కన నిల్చున్న భక్తుల్లో మాణిక్యం, వరలక్ష్మీ, గంగాభవానీ, మరో భక్తుడికి గాయాలయ్యాయి. మిగిలినవారు ప్రమాదాన్ని గుర్తించి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద ఘటన చూసిన కడపకు వస్తున్న అన్నమయ్య జిల్లా రామాపురం జడ్పీటీసీ సభ్యుడు వెంకటరమణ కొంతమందిని తన వాహనంలో తీసుకెళ్లి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నలుగురు చికిత్స పొందుతున్నారు.
ఆటోను ఢీకొట్టిన లారీ…ముగ్గురి మృతి…
వైఎస్సాఆర్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎరగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన దస్తగిరి), సరస్వతి, ప్రేమ్కుమార్ ఆటోలో కొండాపురం మండలం దత్తాపురం వచ్చారు. గత కొన్ని రోజులుగా సరస్వతికి అనారోగ్యంగా ఉండడంతో తాయిత్తు కట్టించుకొని తిరిగి స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్నారు.
కడప-తాడిపత్రి ప్రధాన రహదారిలోని ముద్దనూరు మండలం చెన్నారెడ్డి పల్లె వద్ద ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దస్తగిరి, సరస్వతి అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్ ప్రేమ్కుమార్ను 108 వాహనంలో ప్రొద్దుటూరు వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు.