ఆంధ్రప్రదేశ్ నుంచి మరో మూడు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు.. ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జూన్ 2 నుంచి విజయవాడ- బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తాయని రామ్మోహన్ వివరించారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని నుంచి ఐటీ హబ్ బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చని చెప్పారు.
అలాగే జూన్ 12 నుంచి విశాఖపట్నం- భువనేశ్వర్ సర్వీసు ప్రారంభం కానుందని కేంద్రమంత్రి వెల్లడించారు. రెండు తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ఈ సర్వీసు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. విశాఖ - అబుదాబి అంతర్జాతీయ సర్వీసు జూన్ 13 నుంచి ప్రారంభమవుతుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇండిగో సంస్థ ద్వారా వారానికి నాలుగు రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చి 8 ఏళ్లు దాటుతోంది. కానీ కనీసం ఇప్పటికీ ఒక్క రోజువారీ అంతర్జాతీయ సర్వీసునూ ఏ దేశానికీ నడపడం లేదు. కొద్దికాలంగా షార్జాకు ప్రతి మంగళ, శనివారాల్లో ఒక సర్వీసు నడుస్తోంది. ఇక్కడి నుంచి రోజువారీ సర్వీసులు లేకనే ఇతర నగరాలకు వెళ్లి.. అక్కడి నుంచి విమానాలను అందుకోవాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.
విజయవాడ నుంచి దుబాయ్, కువైట్, బహ్రెయిన్, సింగపూర్, మలేషియా, కొలంబో, బ్యాంకాక్.. ఈ రూట్లకు భారీగా డిమాండ్ ఉంటోంది. ఈ మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేలా విమానయాన సంస్థలతో మాట్లాడతామని.. అనేకసార్లు అభివృద్ధి కమిటీ సమావేశాల్లో హామీలిచ్చారు. కానీ ఆచరణలో చూపలేదు. కనీసం ఇక్కడి నుంచి దుబాయికి సర్వీసులు ఆరంభమైతే.. ప్రపంచంలో ఏ మూలకైనా తేలికగా చేరుకునే సౌకర్యం ఉంటుంది. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 2019లో ప్రజాభిప్రాయం సేకరించగా.. దుబాయ్, సింగపూర్లకే నడపాలని ఏకంగా 2.5 లక్షల మంది విజ్ఞప్తి చేశారు. దీనిపై కార్యాచరణ ప్రారంభించాలనే డిమాండ్లు ఉన్నాయి.
గోవా, షిర్డీ, వారణాసి, కొచ్చి సహా పలు ప్రధాన నగరాలకు గన్నవరం నుంచి సర్వీసులు నడపాలని ప్రయాణికులు నుంచి విజ్ఞప్తులొస్తున్నాయి. గతంలో వారణాసి, షిర్డీ, కొచ్చికి కొన్నాళ్లు సర్వీసులు నడిపారు. రద్దీగా నడిచినా ఆపేశారు. గన్నవరం నుంచి ప్రస్తుతం రోజుకు 24 సర్వీసులే నడుస్తున్నాయి. అయినా ఏడాదిలో ప్రయాణికులు 13 లక్షలు దాటారు. ఉన్న సర్వీసుల్లో హైదరాబాద్ (7) బెంగళూరు (5), ఢిల్లీ (3), చెన్నై(3) ఇలా ఈ నాలుగు నగరాలకే 18 ఉన్నాయి. మిగతా ముంబయి, విశాఖ, తిరుపతి, కడపకు ఒకటి, రెండు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హైదరాబాద్, బెంగళూరుకు వెళ్లి.. అక్కడి నుంచి దేశంలోని ఇతర నగరాలకు వెళ్తున్నారు.
సంబంధిత కథనం