AP Ration Dealer Recruitment : కాకినాడ జిల్లాలో 146 రేషన్ డీలర్ ఖాళీలు - ఇలా దరఖాస్తు చేసుకోండి
కాకినాడ జిల్లాలో 146 రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన వారు జనవరి 8 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 9 తేదీన దరఖాస్తుల పరిశీలిస్తారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి జనవరి 14న రాత పరీక్ష నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదిక కాకినాడ జిల్లాలో 146 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులు కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, మండల తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
దరఖాస్తులను రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో, మండల తాహశీల్దార్ కార్యాలయాల్లో ఆఫ్లైన్లోనే చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు దాఖలకు జనవరి 8 ఆఖరు తేదీగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.
ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు?
కాకినాడ జిల్లాలో 146 పోస్టులకు గానూ కాకినాడ రెవెన్యూ డివిజన్లో 96, పెద్దాపురం రెవెన్యూ డివిజన్లో 50 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని గొల్లప్రోలు-7, కాజులూరు-6, కాకినాడ రూరల్ -2, కాకినాడ అర్బన్-33, కరప-6, పెదపూడి-6, పిఠాపురం-1, సామర్లకోట-13, తాళ్లరేవు 18, యు.కొత్తపల్లి-4 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని గండేపల్లి-6, జగ్గంపేట-1, కిర్లంపూడి-4, కోటనందూరు-4, పెద్దాపురం-8, ప్రతిపాడు-4, రౌతలపూడి-6, శంఖవరం-2, తొండగి-4, తుని-6, ఏలేశ్వరం -5 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు….
రేషన్ డీలర్ల పోస్టులను భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్యా అర్హతను నిర్ణయించారు. అలాగే వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్డ్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయించిన మినహాయింపు ఉంటుంది.
డీలర్ పోస్టుకు, దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండకూడదు. చదువుతున్నవారు, విద్యా వలంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నవారు, ఆశ కార్యక్తలు దరఖాస్తు దాఖలకు అనర్హులు. ఆర్థిక స్థోమత వివరాలు తెలుపుతూ స్వీయ డిక్లరేషన్, సర్టిఫికెట్ సమర్పించాలి. దరఖాస్తుదారుల కుంటుబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులై ఉండరాదు.
షెడ్యూల్ వివరాలు…
అభ్యర్థులు జనవరి 8 తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 9 తేదీన దరఖాస్తుల పరిశీలించనున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తారు. ఎంపికైన వారికి జనవరి 14న రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ జనవరి 12న జారీ చేస్తారు.
జనవరి 15న రాత పరీక్షల ఫలితాలు వెల్లడిస్తారు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. రాత పరీక్షలో ఆయా ప్రాంతాలకు చెందిన అత్యధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్యర్థులకు జనవరి 16న ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. జనవరి 17న ఎంపికైన వారి తుది జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. మొత్తం 100 మర్కులు ఉండగా, అందులో రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నుంచి ఇంటర్వ్యూకు 1ః15 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. ఇంటర్మీడియట్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిపికేట్లు
2,. వయస్సు ధ్రువీకరణ పత్రం
3. నివాస ధ్రువీకరణ పత్రం (ఓటరు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా పర్వాలేదు)
4. మూడు పాస్పోట్ సైజ్ పోటోలు
5. కుల ధ్రువీకరణ పత్రం
6. నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం
7. దివ్యాంగుల కేటగిరికి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలి.
ఆయా రెవెన్యూ డివిజన్కు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఆర్డీవో కార్యాలయం, సంబందిత తహశీల్దారు కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, గ్రామా సచివాలయం నోటీసు బోర్డు, సంబందిత రేషన్ షాపుల వద్ద ప్రచురిస్తారు. పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తులను ఆయా మండలాల తహశీల్దారు కార్యాలయాల్లోనూ, లేదా ఆర్డీవో కార్యాలయంలోనూ నుంచి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫాంను నేరుగా గాని, లేదా పోస్టు ద్వారా గాని సంబంధిత ఆర్డీవో కార్యాలయానికి, లేదా తాహశీల్దారు కార్యాలయంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జత చేయడం తప్పని సరి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం