తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Crime: కరీంనగర్ లో ఇద్దరు చైన్ స్నాచర్లు,బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్, బంగారం స్వాధీనం

Karimnagar Crime: కరీంనగర్ లో ఇద్దరు చైన్ స్నాచర్లు,బంగారం కొన్న వ్యక్తి అరెస్ట్, బంగారం స్వాధీనం

HT Telugu Desk HT Telugu

Published Oct 09, 2024 07:31 AM IST

google News
    • Karimnagar Crime: కరీంనగర్ లో చైన్ స్నాచర్ల ఆట కట్టించారు పోలీసులు. ఇద్దరు చైన్ స్నాచర్లతో పాటు చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముగ్గురి నుంచి 105.85 గ్రాముల బంగారంతో పాటు రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.
ఛైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

ఛైన్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Karimnagar Crime: చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి 105గ్రాముల బంగారాన్ని కరీంనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏసిపి వెంకటరమణ సమక్షంలో అరెస్ట్ అయిన ముగ్గురిని చూపించి స్వాధీనం చేసుకున్న సొత్తును ప్రదర్శించి వివరాలు వెల్లడించారు.

ఎలబోపోతారం గ్రామానికి చెందిన ఏడవెల్లి దీపక్, చంద్.. ఇద్దరు అన్నదమ్ములు జల్సాలకు అలవాటు పడి ఒంటరి మహిళను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. కరీంనగర్ నగరంతోపాటు సమీప గ్రామాలల్లో ఏడు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు.‌ పోలీసులు నిఘా పెట్టగా ఇద్దరు పట్టుబడ్డారని ఏసిపి తెలిపారు. వారిని విచారించగా చైన్ స్నాచింగ్ తో దోచుకున్న బంగారాన్ని కొనుగోలు చేసిన వెల్గటూర్ మండలం సంకెనపల్లి కి చెందిన సింహరాజు నరేష్ ను సైతం అరెస్టు చేశామని చెప్పారు. వారి నుంచి 105.85 గ్రాముల బంగారం, TS 02 FG 6326 స్క్రూటి, TS 22 J 6452 బుల్లెట్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఏడు చైన్ స్నాచింగ్ కేసులు

ఇద్దరు అన్నదమ్ములు బైక్ పై తిరుగుతూ ఒంటరి మహిళల లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. కరీంనగర్ టూటౌన్, త్రీ టౌన్, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడగా ఏడు కేసులు నమోదు చేశారు. చాకచక్యంగా చైన్ స్నాచర్ లను పట్టుకున్న పోలీసులను ఏసిపి అభినందించారు.

చెత్త పేరుతో చోరీలు ..నలుగురు మహిళలు అరెస్టు

పగటి వేళలో చెత్త ఏరుకుంటూ తాళాలు వేసిన ఇళ్ళలో చోరీలకు పాల్పడే ముఠాకు చెందిన నలుగురు మహిళలను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నాడు. చెత్త ఏరుకునే ఉడుత వైష్ణవి, లోకిని స్వప్న, లోకిని లచ్చమ్మ, కట్ల రజిత, కట్ల శ్రీనివాస్ లు పట్టపగలు తాళం వేసిన ఇళ్ళలో చొరబడి బిందెలను ఇతరత్రా సామానును దొంగలించి అమ్ముకుంటున్నారు.

ఇటీవల చిల్లర దొంగతనాలు ఎక్కువగా జరగడంతో నిఘా పెట్టగా గర్రెపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి ఇత్తడి సామాన్లు దొంగతనం చేసి పారిపోతుండగా నలుగురు మహిళలు పట్టుబడ్డారని సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. శ్రీనివాస్ పారిపోయాడని చెప్పారు. పట్టుబడ్డ వారి నుంచి ఇత్తడి సామాను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)