Janwada Farm House Row : హైకోర్టు మెట్లెక్కిన రాజ్ పాకాల.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
28 October 2024, 12:59 IST
- Janwada Farm House Row : జన్వాడ ఫామ్ హౌస్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో.. ఏ1 రాజ్ పాకాల తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అటు రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పార్టీ కేసుకు సంబంధించి విచారణ జరపాలని స్పష్టం చేశారు.
రాజ్ పాకాల
హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో.. హైకోర్టును ఆశ్రయించారు రాజ్ పాకాల. దీంతో ఈ కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఫామ్ హౌస్లో పార్టీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ 35 (3) సెక్షన్ ప్రకారం నోటీసు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని నోటీసులో పేర్కొన్న పోలీసులు.. సోమవారం తమ ముందు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. అడ్రస్ ప్రూఫ్ తోపాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని కోరారు.
రాజ్ పాకాల విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు. సోమవారం మోకిలా పీఎస్కు హాజరు కాకపోతే బీఎన్ఎస్ 35 (3), (4), (5), (6) సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. పార్టీని అరెంజ్ చేసిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాజ్ పాకాల, విజయ్ మద్దూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై విజయ్ మద్దూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల స్టేట్మెంట్ను విజయ్ మద్దూరి ఖండించారు. తాను అలా చెప్పలేదని స్పష్టం చేశారు. 'నేను చెప్పని మాటలు నేను చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్ కాపీలో రాసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబ సభ్యులతో కలిసి రాజ్ పాకాల ఇంట్లో ఫంక్షన్కి వెళ్తే బద్నాం చేయాలని కుట్రపూరితంగా చేస్తున్నారు' అని విజయ్ మద్దూరి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'అది ఫామ్హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు. ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లోకి వెళ్లినప్పుడు అందరిని పిలవలేక పోయాడు. అందుకు దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. అది ఫ్యామిలీ ఫంక్షన్. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ.. కొంత మంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. మా అత్తమ్మ(70) కూడా అక్కడే ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు. ఒక కుటుంబం అంతా కలిసి అక్కడ ఉంటే రేవ్ పార్టీ అని ఎలా అంటారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'ఆదివారం పొద్దున నాలుగు బాటిళ్లు దొరికాయని ఎక్సైజ్ కేసు పెడుతున్నామని అన్నారు. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా మారిపోయింది. ఎన్టీపీఎస్లో 25, 27, 29 సెక్షన్లు పెట్టారు. అసలు ఆ సెక్షన్లు ఏంటి.. సప్లయర్, కన్సెప్షన్, కో హోస్ట్. అసలు సప్లయర్ అనే సెక్షన్ పెట్టాలంటే అక్కడ డ్రగ్స్ దొరికి ఉండాలి లేదా ఎవరో ఒకరు సప్లై చేసి ఉండాలి. అసలు డ్రగ్సే దొరకలేదని మీరే చెప్తుంటే, ఆ కేసు ఎలా పెడతారు? అక్కడ 14 మందికి టెస్ట్ చేస్తే.. 13 మందికి నెగటివ్ వచ్చింది. ఒకరికి పాజిటివ్ వస్తే ఆయన ఎక్కడ తీసుకున్నాడో తెలుసుకోకుండా ఎలా కేసు పెడతారు' అని కేటీఆర్ ప్రశ్నించారు.