TG Vice Chancellor Appointment : తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం
18 October 2024, 16:24 IST
- TG Vice Chancellor Appointment : తెలంగాణలో 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించారు. ఉస్మానియా వర్సిటీ వీసీగా ఎం.కుమార్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రతాప్రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ
ప్రముఖ యూనివర్సిటీల్లో రెగ్యులర్ వీసీలను నియమించాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది. విద్యార్థులు కూడా ఆందోళనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమించారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. వీసీలను నియమించడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం ప్రభుత్వం గతంలోనే సెర్చ్ కమిటీని నియమించింది. ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. కానీ.. సెర్చ్ కమిటీ భేటీ కాకపోవడంతో వీసీల నియామక ప్రక్రియలో ముందడుగు పడలేదు. అయితే, అక్టోబర్ 4న కమిటీ సెర్చ్ కమిటీ భేటీ అయ్యింది. ఆశావాహుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. కొందరి పేర్లను ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించింది. దీంతో తాజాగా కొత్త వీసీల పేర్లను ప్రకటించారు.
ఏ యూనివర్సిటీకి ఎవరు వీసీ..
1.పాలమూరు వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జి.ఎన్.శ్రీనివాస్ నియమితులయ్యారు.
2.కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డిని గవర్నర్ నియమించారు.
3.ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కుమార్ నియమితులయ్యారు.
4.శాతవాహన వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ను నియమించారు.
5.తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ నిత్యానందరావును గవర్నర్ నియమించారు
6.మహాత్మా గాంధీ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్ నియమితులయ్యారు.
7.తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ యాదగిరిరావును నియమించారు.
8.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా జానయ్యను గవర్నర్ నియమించారు.
9.ఉద్యానవన వర్సిటీ వీసీగా రాజిరెడ్డిని నియమించారు.