తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rain Alert : చలికాలంలో వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​..

Rain alert : చలికాలంలో వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్​..

Sharath Chitturi HT Telugu

Published Jan 12, 2025 09:00 AM IST

google News
    • Andhra Pradesh Rain alert : ఇటు దక్షిణ భారతం, అటు ఉత్తర- ఈశాన్య భారతంలోని పలు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన జారీ చేసింది. అంతేకాదు హిమాలయ ప్రాంతాల్లో మంచు కూడా కురుస్తుందని స్పష్టం చేసింది.
చలికాలంలో వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్!

చలికాలంలో వర్షాలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్!

రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్​, తమిళనాడుతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. వీటితో పాటు జనవరి 15-17 తేదీల మధ్య జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో హిమపాతం హెచ్చరికలు సైతం జారీ చేశారు. అత్యంత దట్టమైన పొగమంచు కోసం ఆరెంజ్ అలర్ట్​ను కూడా జారీ చేసినట్లు తెలిపింది.

సంక్రాంతి వేళ వర్షాలు..!

జనవరి 12న ఉదయం దిల్లీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్​డబ్ల్యూఎఫ్​సీ దిల్లీ అంచనా ప్రకారం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జనవరి 14, 15 తేదీల్లో తూర్పు రాజస్థాన్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అసోం, మేఘాలయలో జనవరి 13న ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనవరి 15 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. జనవరి 12-14 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, 13,14 తేదీల్లో రాయలసీమ; జనవరి 13-15 మధ్య కేరళ- మాహే. జనవరి 15 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్​లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అటు బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్త ప్రభావం కొనసాగుతోంది. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

హిమపాతం కూడా..!

2025 జనవరి 14 రాత్రి నుంచి వాయవ్య భారతంపై తాజా పశ్చిమ అలజడి ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా జనవరి 15 నుంచి 17 వరకు జమ్మూకశ్మీర్-లడఖ్-గిల్గిట్-బాల్టిస్థాన్-ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్​లో భారీ వర్షాలు, హిమపాతం కురిసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్​లో చలిగాలులు కొనసాగుతున్నాయని.. ఆదివారం లోతట్టు, మైదాన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్య, ఎత్తైన కొండల్లో మంచు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం