తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-ug 2024 Results: నీట్ యూజీ 2024 ఫలితాలపై సుప్రీంకోర్టులో పిల్ వేసిన ‘ఫిజిక్స్ వాలా’ అలఖ్ పాండే

NEET-UG 2024 results: నీట్ యూజీ 2024 ఫలితాలపై సుప్రీంకోర్టులో పిల్ వేసిన ‘ఫిజిక్స్ వాలా’ అలఖ్ పాండే

HT Telugu Desk HT Telugu

Published Jun 12, 2024 05:46 PM IST

google News
  • PIL on NEET-UG 2024 results: నీట్ యూజీ 2024 ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వాటిపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రముఖ ఎడ్యు టెక్ స్టార్ట్ అప్ ‘ఫిజిక్స్ వాలా’ వ్యవస్థాపకుడు అలఖ్ పాండే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

నీట్ యూజీ 2024 ఫలితాలపై సుప్రీంకోర్టులో పిల్

నీట్ యూజీ 2024 ఫలితాలపై సుప్రీంకోర్టులో పిల్

PIL on NEET-UG 2024 results: అఖిల భారత వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024లో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరపాలని పోటీ పరీక్షల ప్రిపరేషన్ స్టార్టప్ ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే సుప్రీంకోర్టును కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 1,500 మందికి పైగా నీట్-యూజీ 2024 అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీని నియమించాలని కోరుతూ అలఖ్ పాండే ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. మెడికల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ప్రక్రియ, ఫలితాల్లో ఏమైనా అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు అవసరమని ఫిజిక్స్ వాలా విడుదల చేసిన ఒక ప్రకటనలో అలఖ్ పాండే పేర్కొన్నారు. రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం జరిగేలా న్యాయ ప్రక్రియ ఉంటుందని నమ్ముతున్నానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్టీఏ ఏకపక్ష నిర్ణయం

గ్రేస్ మార్కులు ఇవ్వాలన్న ఎన్టీఏ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, కనీసం 1,500 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కుల ద్వారా 70 నుంచి 80 మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోందని అలఖ్ పాండే తెలిపారు. ఈ విషయమై 20,000 మంది విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, అందువల్లనే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.

నార్మలైజేషన్ ఫార్ములా ఫాలో కాలేదు

పరీక్ష సమయంలో సమయం కోల్పోయినందుకు పరిహారంగా గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ మరో నీట్ అభ్యర్థి కూడా పిటిషన్ దాఖలు చేశారు. గ్రేస్ మార్కులు ఇవ్వడానికి 'నార్మలైజేషన్ ఫార్ములా' ఉంటుందని, దాని ప్రకారం, వృథా అయిన సమయానికి అనుగుణంగా సమాధానం ఇవ్వకుండా మిగిలిపోయే ప్రశ్నల సంఖ్యకు మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది నీట్ పరీక్షల్లో 'గ్రేస్ మార్కులు' పొందిన 1,500 మందికి పైగా అభ్యర్థుల ఫలితాలను సమీక్షించడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఏ, విద్యాశాఖ ప్రకటించాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం