తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahakumbh Mela 2025 : మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు, 40 వేల సెక్యూరిటీ, లక్షకుపైగా టెంట్లు!

Mahakumbh Mela 2025 : మహా కుంభమేళాకు 45 కోట్ల మంది భక్తులు, 40 వేల సెక్యూరిటీ, లక్షకుపైగా టెంట్లు!

Anand Sai HT Telugu

13 January 2025, 16:54 IST

google News
    • Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా ప్రారంభమైంది. ఈ మహా కుంభమేళా 2025 కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది.
మహా కుంభమేళా
మహా కుంభమేళా (PIB India)

మహా కుంభమేళా

ఈ భూమి మీద అత్యధిక జనాలు తరలివచ్చే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం యూపీలోని ప్రయాగ్‌రాజ్. సోమవారంతో ప్రారంభమైన ఈ వేడుక 45 రోజులపాటు సాగి ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ కుంభమేళాకు దేశావిదేశాల నుంచి సుమారు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ మేరకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం నుంచే భక్తులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని పుణ్య స్నానాలు చేస్తున్నారు.

కోట్ల మంది భక్తులు

పుష్య పౌర్ణమి(జనవరి 13) నాడు సుమారు 1 కోటి మందికిపైగా భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని అధికారులు ముందుగానే అంచనా వేశారు. మకర సంక్రాంతి(జనవరి 14) నాడు 3 కోట్ల మంది ప్రజలు పవిత్ర స్నానాలు చేస్తారని అంచనా. పోలీసులు మొత్తం కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. త్రివేణి సంగమానికి వెళ్లే మొత్తం ఏడు మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను ఏర్పాటు చేశారు.

సీసీటీవీ కెమెరాలు

2,751 సీసీటీవీ కెమెరాలు, ఇందులో 328 ఏఐ- ఎనేబుల్డ్ కెమెరాలు, అధునాతన ఏఐ పవర్డ్ అనలిటిక్స్‌లు నిఘాను మెరుగుపరచడానికి కీలకమైన ప్రదేశాలలో అమర్చారు. సెవెన్ స్టెప్స్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అంటే భద్రతా మహాకుంభ మేళాలో కోటలాగా ఉంటుంది.

భారీగా భద్రతా

కుంభమేళా ప్రాంతంలో చుట్టుపక్కల పారామిలటరీ బలగాలు, యూపీ సాంకేతిక సేవల బృందాలతో సహా సుమారు 40,000 మంది పోలీసులను మోహరించారని అని ఐజీ (ప్రయాగ్‌రాజ్ రేంజ్) ప్రేమ్ గౌతమ్‌ చెప్పారు. క్యాంపులు, డేరా నగరాలు, సంగం, సంస్కృతి గ్రామ్‌లతో సహా అన్ని కీలక ప్రదేశాలు కూడా పోలీసు నిఘాలో ఉన్నాయని ఆయన చెప్పారు.

భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా నైపుణ్యం కలిగిన నిపుణుల బృందంతో అధునాతన యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరోవైపు 24/7 నిఘా అందించడానికి 20 హైటెక్ డ్రోన్‌లను మోహరించారు. ఈ డ్రోన్‌లు మేళాలోని మొత్తం 25 సెక్టార్‌లలో రియల్ టైమ్ అప్‌డేట్‌లను అందిస్తాయి. ఒకే క్లిక్‌తో వివరాలను సేకరిస్తాయి.

లక్షకుపైగా టెంట్లు

యాత్రికుల వసతి కోసం అధికారులు 150,000 టెంట్లు ఏర్పాటు చేశారు. 4,50,000 కొత్త విద్యుత్ కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటిలో సగానికి పైగా ఇప్పటికే కేటాయించారు.

2017లో కుంభమేళాకు యునెస్కో గుర్తింపు వచ్చింది. భారతదేశంలోని పవిత్ర నదుల వెంట నాలుగు నగరాల్లో కుంభమేళా జరుగుతుంది. యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్‌లలో నిర్వహిస్తారు. అయితే మహా కుంభమేళా మాత్రం త్రివేణి సంగం అయిన ప్రయాగ్‌రాజ్‌లో ఘనంగా జరుగుతుంది. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం