తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cbse : సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సిలబస్​ 15శాతం తగ్గిందా? అసలు నిజం ఇదే..

CBSE : సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సిలబస్​ 15శాతం తగ్గిందా? అసలు నిజం ఇదే..

Sharath Chitturi HT Telugu

Published Nov 15, 2024 07:20 AM IST

google News
    • CBSE board exams : 10, 12వ తరగతి పరీక్షల సిలబస్ ను 15 శాతం తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ ఈ) తోసిపుచ్చింది. అవన్నీ ఫేక్​ న్యూస్​ని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు..
సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సిలబస్​ 15శాతం తగ్గిందా? (Pixabay)

సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సిలబస్​ 15శాతం తగ్గిందా?

సీబీఎస్​ఈ క్లాస్​ 10, క్లాస్​ 12 సిలబస్​ విషయంలో ఇటీవల గందరగోళం నెలకొంది. రెండు తరగతుల సిలబస్​ని 15శాతం మేర తగ్గిస్తూ సీబీఎస్​ఈ నిర్ణయం తీసుకుందని గురువారం వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఎంపిక చేసిన సబ్జెక్ట్స్​లో ఓపెన్​ బుక్​ పరీక్షలు నిర్వహించేందుకు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ ఏర్పాట్లు చేస్తున్నట్టు పలు నివేదికలు చెప్పాయి. ఈ వ్యవహారంపై సీబీఎస్​ఈ తాజాగా స్పందించింది. అవన్నీ ఫేక్​ అని, తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. 2025 బోర్డు పరీక్షల కోసం 10, 12 తరగతుల సిలబస్​ని తగ్గించాలని, ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని తేల్చిచెప్పింది.


ఇదీ జరిగింది..

విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే క్రమంలో సిలబస్​ని కట్​ చేసేందుకు సీబీఎస్​ఈ ప్రయత్నిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే తాము అలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి వార్తలు నిరాధారమైనవని బోర్డు తెలిపింది.

“మూల్యాంకన వ్యవస్థ లేదా పరీక్షా విధానంలో బోర్డు అటువంటి నోటీసును జారీ చేయలేదు. ఎటువంటి మార్పులు చేయలేదు. బోర్డు విధాన నిర్ణయాలకు సంబంధించిన సమాచారం బోర్డు అధికారిక వెబ్​సైట్ లేదా అధీకృత మార్గాల ద్వారా మాత్రమే ప్రచురిస్తాము,” అని సీబీఎస్​ఈ తెలిపింది.

సీబీఎస్ఈ తన పరీక్షా విధానం లేదా అంతర్గత మూల్యాంకన వ్యవస్థలో ఎటువంటి మార్పులు చేయలేదని, దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ జారీ చేయలేదని స్పష్టం చేసింది.

కఠినంగా వ్యవహరిస్తున్న సీబీఎస్​ఈ..

మరోవైపు ఈ నెల ప్రారంభంలో, సీబీఎస్​ఈ 21 పాఠశాలల అఫిలియేషన్​ని ఉపసంహరించుకుంది. సెప్టెంబర్​లో రాజస్థాన్, దిల్లీలోని పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన తరువాత ఆరు స్కూళ్లను సీనియర్ సెకండరీ స్థాయి నుంచి సెకండరీ స్థాయికి డౌన్​గ్రేడ్ చేసింది.

అఫిలియేషన్ ఉపసంహరించుకున్న 21 పాఠశాలల్లో 16 దిల్లీలో ఉండగా, ఐదు కోచింగ్ కేంద్రాలు కోటా, సికార్​లో ఉన్నాయి.

“డమ్మీ లేదా హాజరుకాని అడ్మిషన్ల విధానం పాఠశాల విద్య ప్రధాన లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది విద్యార్థుల పునాది, ఎదుగుదలకు విఘాతం కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, డమ్మీ పాఠశాలల వ్యాప్తిని ఎదుర్కోవటానికి మేము నిర్ణయాత్మక చర్య తీసుకుంటున్నాము. డమ్మీ లేదా హాజరుకాని ప్రవేశాలను అంగీకరించే ప్రలోభాన్ని ప్రతిఘటించడానికి అన్ని అనుబంధ సంస్థలకు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాము,” అని సీబీఎస్​ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా అన్నారు.

తనిఖీల్లో గమనించిన అవకతవకలకు సంబంధించి ఆకస్మిక తనిఖీ కమిటీల కీలక పరిశీలనలను.. సంబంధిత పాఠశాలలకు నివేదికగా తెలియజేశామని ఆయన తెలిపారు.

డమ్మీ విద్యార్థులు, అనర్హుల నమోదు కోసం సీబీఎస్ఈ ఈ ఏడాది ప్రారంభంలో 20 పాఠశాలల అఫిలియేషన్​ని రద్దు చేసింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.