India vs Pakistan OTT: ఓటీటీలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుపై సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..
13 January 2025, 14:06 IST
- The Greatest Rivalry: India vs Pakistan OTT: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరాటాలతో ఓ డాక్యుమెంటరీ సిరీస్ రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెరిగిపోయింది.

India vs Pakistan OTT: ఓటీటీలో భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుపై సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఎక్కడంటే..
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అదో సమరంలా ఉంటుంది. ఇరు దేశాల అభిమానుల మధ్య భావోద్వేగాలు తారస్థాయిలో ఉంటాయి. దాయాదుల మధ్య పోరు క్రికెట్ మైదానంలో ఓ యుద్ధాన్ని తలపిస్తుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎమోషన్స్, డ్రామా ఎక్కువగా ఉంటాయి. ఈ సమరంపై క్రికెట్ ప్రపంచమంతా క్రేజ్ ఉంటుంది. భారత్, పాక్ మధ్య ఇప్పటి వరకు చాలా గుర్తుండిపోయే మ్యాచ్లు జరిగాయి. ఉత్కంఠతో నారాలు తెగిపోయేలాంటి మ్యాచ్లు ఊపేశాయి. ఇప్పుడు, భారత్, పాకిస్థాన్ క్రికెట్ పోరుపై ఓటీటీలో ఓ డాక్యుమెంటరీ రానుంది. ఆ వివరాలు ఇవే..
డాక్యుమెంటరీ సిరీస్ వివరాలు ఇవే..
‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్’ పేరుతో డాక్యుమెంటరీ సిరీస్ సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్లు, సస్పెన్స్ఫుల్ మూవ్మెంట్స్, మ్యాచ్ల్లో కీలక మలుపులు, మరపురాని సిక్స్లు, ఆటగాళ్ల అద్భుత పోరాటాలు ఇలా చాలా అంశాలు ఈ డాక్యుమెంటరీలో ఉండనున్నాయి. భారత్, పాక్ క్రికెట్లో కీలక ఘట్టాలు ఈ సిరీస్లో ఉంటాయి. దీంతో ఈ డాక్యుమెంటరీ సిరీస్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎలా ఉంటుందోనని ఆత్రుతగా నిరీక్షిస్తున్నారు.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్’ డాక్యుమెంటరీ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సిరీస్ను స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్టు నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. “రెండు దేశాలు, ఓ సమరం.. 160కోట్ల మంది ప్లేయర్లు. ఎంతో థ్రిల్ను పంచే ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ను నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 7న చూసేయండి” అని ఇన్స్టాగ్రామ్ వేదికగా నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. భారత స్టార్లు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా.. పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానంలో చర్చించుకుంటున్నట్టుగా ఓ పోస్టర్ వదిలింది.
సిరీస్లో క్రికెట్ దిగ్గజాలు
‘ది గ్రేటెస్ట్ రైవల్రీ: ఇండియా వర్సెస్ పాకిస్థాన్’ సిరీస్లో మ్యాచ్ల్లోని కీలకమైన ఘట్టాలతో పాటు కొందరు దిగ్గజ ఆటగాళ్ల ఇంటర్వూలు కూడా ఉంటాయి. భారత లెజెండ్స్ వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ సహా మరికొందరు ప్లేయర్లు ఈ సిరీస్లో కనిపించనున్నారు. వారి అనుభవాలు, అభిప్రాయాలు ఉంటాయి. పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనిపించన్నారు. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఉండనున్నారు. మరికొందరు ప్లేయర్లు కూడా ఈ సిరీస్లో కనిపించవచ్చు. కొన్ని కొత్త విషయాలు కూడా ఈ సిరీస్ ద్వారా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తంతా భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరంపై రానున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ క్యూరియాసిటీ పెంచేసింది. ఫిబ్రవరి 7న నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది.
భారత్, పాకిస్థాన్ తదుపరి మ్యాచ్
భారత్, పాకిస్థాన్ తదుపరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 23న తలపడనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఈ టోర్నీ మొదలుకానుంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. పాక్కు వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో ఈ టోర్నీలో తన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫిబ్రవరి 20న బంగ్లాతో భారత్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన దుబాయి వేదికగా జరగనుంది.