RBI Monetary Policy : వడ్డీ రేట్లు యథాతథం- వరుసగా 11వ సారి ఇలా..
07 December 2024, 6:45 IST
- RBI Monetary Policy : దేశంలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు.వరుసగా 11వసారి రెపో రేటు 6.50శాతం వద్ద కొనసాగుతోంది.
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్..
ఆర్థిక వృద్ధి- వినియోగదారులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎత్తిచూపుతూ.. రెపో రేటు, విధాన వైఖరిపై యథాతథ స్థితిని పాటిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. వరుసగా 11వసారి రెపో రేటును 6.50 శాతంగానే కొనసాగించాలని సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 4:2 మెజారిటీతో నిర్ణయించింది.
ఆర్బీఐ ఎంపీసీ డిసెంబర్ సమావేశం ముఖ్యాంశాలను పరిశీలిద్దాం:
మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం డిసెంబర్ 4న ప్రారంభమై నేటితో ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్.. రెపో రేటును యథాతథంగా ఉంచుతున్నట్టు వెల్లడించారు.
రెపో రేట్లలో మార్పు లేదు..
వరుసగా 11 సమావేశంలో బెంచ్ మార్క్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ద్రవ్య విధాన వైఖరిని 'తటస్థంగా' ఉంచింది.
ద్రవ్యోల్బణం పెరగడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణమని ఆర్బీఐ గవర్నర్ దాస్ పేర్కొన్నారు.
అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.21 శాతానికి పెరిగింద., ఇది ఒక సంవత్సరంలో మొదటిసారి సెంట్రల్ బ్యాంక్ టాలరెన్స్ బ్యాండ్ని అధిగమించింది. ఇదిలావుండగా, జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోయింది. ఇది ఏడు త్రైమాసికాల్లో బలహీనమైన వేగాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల కోత ఉంటుందా? అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ ఈసారి ఆర్బీఐ రెపో రేట్లను కట్ చేయలేదు. ఇక ఫిబ్రవరిలో జరిగే సమావేశంలోనైనా వడ్డీ రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి.
2025 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్బీఐ సవరించింది.
ఆర్బీఐ 2025 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను గతంలో అంచనా వేసిన 7.2 శాతం నుంచి 6.6 శాతానికి సవరించింది.
క్యూ3ఎఫ్వై25 జీడీపీ వృద్ధి అంచనాను 7.4 శాతం నుంచి 6.8 శాతానికి, క్యూ4ఎఫ్వై25 జీడీపీ వృద్ధి అంచనాను 7.4 శాతం నుంచి 7.2 శాతానికి, క్యూ1ఎఫ్వై26 జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతం నుంచి 6.9 శాతానికి కుదించింది.
2026 క్యూ26లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.
సీఆర్ఆర్ 50 బేసిస్ పాయింట్లు కట్..
క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు కట్ చేసి 4శాతానికి తీసుకొచ్చింది ఆర్బీఐ. ఇది లిక్విడిటీ పరిమితులను సులభతం చేయనుంది.
ఎఫ్సీఎన్ఆర్బీ డిపాజిట్లపై వడ్డీ రేట్ల పరిమితి పెంపు..
ఎఫ్సీఎన్ఆర్ -బి డిపాజిట్లపై వడ్డీ రేటు పరిమితులను పెంచాలని ఆర్బిఐ నిర్ణయించిందని గవర్నర్ దాస్ తెలిపారు. విదేశీ పెట్టుబడులకు భారత్ను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడమే ఈ చర్య లక్ష్యమని స్పష్టం చేశారు.