AP Contract Jobs : హైకోర్టు తీర్పుతో ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు-ముందస్తు నోటీసులివ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్
07 December 2024, 18:54 IST
AP Contract Jobs : ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఆ ఉద్యోగుల పాలిట తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు శాపంగా మారాయి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలు ఆందోళనలో చెందుతున్నారు.
హైకోర్టు తీర్పుతో ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు-ముందస్తు నోటీసులివ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ) మేల్స్గా దాదాపు 15 నుంచి 22 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. 2002, 2003, 2007 ఇలా వివిధ దఫాలుగా రిక్రూట్మెంట్లో డీఎస్సీ సెలక్షన్ కమిటీ ద్వారా హెల్త్ అసిస్టెంట్లుగా ఎంపిక అయ్యారు. 2013లో జీవో నెంబర్ 1207 ద్వారా వీరిని ఉద్యోగులుగా గుర్తించారు. తొలుత ఎంపిక అయిన 1,000 మందిని, ఆ తరువాత కాలంలో ఈ జీవో ఆధారంగా ప్రభుత్వం నియమించిన మరో 600 మంది జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారాయి.
తెలంగాణ హైకోర్టు తీర్పు మేరకు ఈ 1,600 మందిని విధుల నుంచి తొలగించాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్వో)లను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రజారోగ్య డైరెక్టర్ పద్మావతి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో డీఎంహెచ్వోలు కూడా ఆ ఉత్తర్వులు ఉద్యోగులకు పంపారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో 75 మంది, నెల్లూరు జిల్లా 164 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదే పరంపర ఇతర జిల్లాల్లో కూడా కొనసాగుతోంది. అయితే ఈ ఉద్యోగుల్లో ఎక్కువ మంది 45-50 ఏళ్ల వయస్సు మధ్య ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే హైకోర్టు తీర్పును అమలు చేయడానికి మూడు నెలల సమయం ఉందని, కానీ వారం కూడా తిరగకుండా హడావుడిగా ప్రభుత్వం విధుల నుంచి తొలగించిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉందని, ఈ విషయం ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డి.ఆస్కార్ రావు కోరారు. కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల ముందస్తు నోటీసు ఇచ్చి, మూడు నెలల జీతం ఇచ్చిన తరువాతే తొలగించాలని తెలిపారు. పదవీ విరమణ దశలో కొంత మంది ఉద్యోగులు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు.
ఏపీలో ఉద్యోగుల తొలగింపు
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంటునున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలుత ఆంధ్రప్రదేశ్ ఖనిజా అభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)లో వైసీపీ సర్కార్ నియమించిన 50 మంది కాంట్రాక్ట్, 45 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం 95 మందిని తొలగించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్లో టెండర్ల రూపంలో మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడంతో ప్రభుత్వం మద్యం షాపులను రద్దు అయ్యాయి. దీంతో ప్రభుత్వ మద్యం షాపుల్లో నియమితులైన సేల్స్ సూపర్ వైజర్లు 3,585 మంది, సేల్స్ మెన్లు 8,778 మంది మొత్తం 12,363 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు.
అలాగే గత ప్రభుత్వ హయంలో నియమితులైన 2,48,779 గ్రామ, వార్డు వాలంటీర్లను తొలగించారు. ఇటీవలి మంత్రి డోలా వీరాంజనేయస్వామి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆయన ప్రకటన వెలువడిన రెండు రోజులకే గ్రామ, వార్డు సచివాలయాల్లో అటెండెన్స్ యాప్ నుంచి వాలంటీర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో 2,48,779 మంది వాలంటీర్లను తొలగించినట్లు స్పష్టం అయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు