తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mega Fans Road Accident : గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి, పవన్ కీలక నిర్ణయం

Mega Fans road accident : గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి, పవన్ కీలక నిర్ణయం

06 January 2025, 19:02 IST

google News
  • Mega Fans road accident : గేమ్ ఛేంజర్ ఈవెంట్ తర్వాత ఇంటికి వెళ్తూ ఇద్దరు మెగా ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు.

గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి, పవన్ కీలక నిర్ణయం
గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి, పవన్ కీలక నిర్ణయం

గేమ్ ఛేంజర్ ఈవెంట్ నుంచి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి, పవన్ కీలక నిర్ణయం

Mega Fans road accident : ఇటీవల రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌ నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు మెగా అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే నిర్మాత దిల్ రాజు బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డారు. వారి కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్ కూడా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌లు ఇరు కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం- పవన్ కల్యాణ్

"కాకినాడ-రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్లల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను"- డిప్యూటీ సీఎం, పవన్ కల్యాణ్

"కాకినాడ-రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీస నిర్వహణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. అయిదు నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. రెండు నగరాల మధ్య ప్రయాణాలకు కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రోడ్లు మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్లండి అని ఆ వేడుకలో ఒకటికి రెండుసార్లు చెప్పడమైంది. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను"- పవన్ కల్యాణ్

అభిమానుల మృతిపై రామ్ చరణ్ దిగ్భ్రాంతి

అభిమానుల మృతిపై రామ్ చరణ్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన సన్నిహితులను పంపి ధైర్యం చెప్పించారు. బాధిత ఫ్యామిలీకి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈవెంట్ కు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటామని, డిప్యూటీ సీఎం, బాబాయ్ పవన్‌ కల్యాణ్ కోరుకునేది కూడా అదే అని రామ్ చరణ్ అన్నారు. ఇలాంటి విషాద ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలనన్నారు. తనకూ అంతే బాధగా ఉందన్నారు.

తదుపరి వ్యాసం