తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Nara Lokesh : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్, ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి

Minister Nara Lokesh : మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్, ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి

07 December 2024, 18:13 IST

google News
  • Minister Nara Lokesh : మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుగా ఉందని మంత్రి లోకేశ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలపై పాఠాలు నేర్పిస్తామన్నారు.

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్, ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి
మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్, ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి

మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ బిగ్ అప్డేట్, ఆరు నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి

అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామని మంత్రి లోకేశ్ అన్నారు. ఆరునెలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మెగా పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ చూస్తుంటే సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టుగా ఉందని అన్నారు. మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో భాగంగా బాపట్ల మున్సిపల్ హైస్కూలులో జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..."మిమ్మల్ని చూసిన తరువాత నాకు నా స్కూల్ డేస్ గుర్తు వచ్చాయి. చిన్నప్పుడు మా స్కూల్ లో పేరెంట్స్ - టీచర్స్ మీటింగ్ జరిగితే మా అమ్మ వచ్చేవారు. మా నాన్న అప్పటికే రాష్ట్రానికి టీచర్ కాబట్టి నా స్కూల్ కు రావడానికి ఆయనకి టైం ఉండేది కాదు. పిల్లల్లో నాకు దేవుడు కనిపిస్తాడు. పిల్లలంతా నా కొడుకు దేవాన్ష్ లాగే అనిపిస్తారు. మా వాడు హైదరాబాద్ లో నేను అమరావతి. వాడితో ఆడుకోవడం కూడా కుదరడం లేదు.

ఎంత ఒత్తిడిలో ఉన్నా...ఎన్ని ప‌నులు ఉన్నా..పిల్లలు క‌నిపిస్తే నేను ఆగిపోతాను. సరదాగా కాసేపు వాళ్లతో ఆడుకుంటాను. పిల్లల బంగారు భ‌విష్యత్తును తీర్చిదిద్దే విద్యాశాఖ మంత్రిని కావ‌డం నా అదృష్టం. ఏ వృత్తి చేప‌ట్టిన వారైనా వారిని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌర‌వం. జాతిపిత మహాత్మాగాంధీజీ చెప్పినట్లు విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమ‌వుతుందని మా ప్రభుత్వం బ‌లంగా న‌మ్ముతోంది. సీఎం చంద్రబాబు విజ‌న‌రీ ఆలోచ‌న‌ల‌తో మన విద్యా వ్యవ‌స్థ దేశానికే ఆదర్శంగా ఉండేలా ఆంధ్ర మోడ‌ల్ తీసుకొస్తున్నాం"అన్నారు.

మెగా పీటీఎం ద్వారా బలమైన బంధం

మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మధ్య బంధం బలపడుతుందని మంత్రి లోకేశ్ అన్నారు. ఒక వ్యవ‌స్థ బాగుప‌డాలంటే...అందులో అందరూ భాగస్వామ్యం అవ్వాలన్నారు. విద్యా వ్యవ‌స్థ ఆద‌ర్శంగా ఉండాలంటే స‌మాజ భాగ‌స్వామ్యం త‌ప్పనిస‌రి అని సీఎం చెప్పారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచ‌న‌ల‌తో బ‌డి భ‌విష్యత్తు కోసం చ‌దివే పిల్లలు-వారి త‌ల్లిదండ్రులు, చ‌దువు చెప్పే ఉపాధ్యాయులు-గైడ్ చేసే హెడ్మాస్టర్లు, పాఠ‌శాల యాజ‌మాన్య క‌మిటీలు, దాత‌లు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు క‌లిసి ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. ఇదే ల‌క్ష్యంతో త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల స‌మావేశం రాష్ట్రమంతా ఒకేరోజున పండ‌గ వాతావ‌ర‌ణంలో నిర్వహించుకుంటున్నామన్నారు.

పేరెంట్ – టీచర్ మీటింగ్ ఒక చరిత్ర

"పేరెంట్-టీచ‌ర్ మీటింగ్ ఒక‌ రికార్డు. రాష్ట్రమంతా ఒకేసారి వేలాది స్కూళ్లలో, ల‌క్షలాది విద్యార్థులు-టీచ‌ర్లు-త‌ల్లిదండ్రులు స‌మావేశం కావ‌డం ఒక చ‌రిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠ‌శాల‌లలో ఒకేసారి నిర్వహిస్తున్నాం. ఇందులో 35 ల‌క్షల మంది విద్యార్థులు, 71 ల‌క్షల త‌ల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ సమావేశాలతో బడితో తల్లితండ్రులకు ఆత్మీయ బంధంఏర్పడుతుంది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. ఈ స‌మావేశం ద్వారా పాఠ‌శాల‌ల స‌మ‌స్యలు తెలుస్తాయి. పిల్లలు ఎలా చ‌దువుతున్నారో త‌ల్లిదండ్రుల‌కు తెలుస్తుంది. విద్యార్థుల‌కు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందిస్తున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో కొన్ని టెస్టులు చేసి ఆ రిపోర్ట్ కూడా పొందుపరుస్తున్నాం. దీని వ‌ల్ల విద్యార్థుల ఆరోగ్యం ఎలా ఉందో త‌ల్లిదండ్రులు, టీచ‌ర్లకు తెలుస్తుంది. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవడానికి దీనిద్వారా ఆస్కారమేర్పడుతుంది. విద్యా వ్యవ‌స్థను గాడిలో పెట్టే బాధ్యత‌ను సీఎం నాపై పెట్టారు. విద్యాశాఖ అంటే ఎన్నో స‌వాళ్లతో కూడిన‌ది...అయినా ఛాలెంజ్ గా తీసుకుని నిర్వహిస్తున్నాను. విద్యా వ్యవ‌స్థను రాజ‌కీయాల‌కు దూరంగా ఉంచాల‌ని క‌ఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం" - మంత్రి నారా లోకేశ్

ప్రభుత్వానికి రంగుల పిచ్చి లేదు

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రంగులు - ఫోటోల పిచ్చి లేదని మంత్రి లోకేశ్ అన్నారు. తాను మంత్రి అయిన వెంటనే ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేశానన్నారు. స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకొని వెళ్లకూడదని స్ట్రిక్ట్ గా చెప్పానన్నారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా“సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్”పంపిణీ చేశామన్నారు. “డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం”కింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అల‌వాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.

బోధనేతర పనిభారాన్ని తొలగించాం

ఉపాధ్యాయులు చదువు మాత్రమే చెప్పాలి, మరుగుదొడ్లు, భోజనం ఫోటోలు తీయడం వారి బాధ్యత కాదని మంత్రి లోకేశ్ అన్నారు. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో టీచర్లు చదువు మాత్రమే చెప్పాలి ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నామని తెలిపారు. పిల్లలను పిడుగులను తయారు చేసే బాధ్యత నాది అన్నారు. కేజీ టూ పీజీ కరికులం మారుస్తున్నామని తెలిపారు. చదువుతో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యమని, మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలన్నారు. ముందు సమాజం లో మార్పు రావాలని, కొందరు చేతికి గాజులు వేసుకున్నావా అని మాట్లాడతారు, అమ్మాయి లా ఏడవకు అని అంటారు. ఈ మాటలు విన్న ప్రతి సారి నాకు బాధ వేస్తుందన్నారు. ఇవన్నీ పోవాలని, ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామన్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వర రావును నియమించామన్నారు.

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

విద్యార్థులు చదువుతో పాటు అన్ని విషయాల్లో నంబర్ 1 గా ఉండాలి అనేది తమ లక్ష్యం అన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చెయ్యబోతున్నామన్నారు. స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టిపెట్టామని తెలిపారు. అన్ని స్కూల్స్ లో టేబుల్స్ , లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లా అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోమన్నారు. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాలతో చర్చించి మాత్రమే తీసుకుంటున్నామన్నారు. డ్రగ్స్, గంజాయికి ఎడిక్ట్ అవ్వడం వలన ఒక తరం నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం క్యాబినెట్ సబ్ కమిటీ, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేట్ స్కూల్స్ టీచర్ల కంటే ప్రభుత్వ పాఠశాలల టీచర్లు బాగా పాఠాలు చెబుతారన్నారు. రాబోయే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలలను 4స్టార్ రేటింగ్ కు తీసుకురావాలన్న సీఎం ఆదేశాలను పాటిస్తామన్నారు.

తదుపరి వ్యాసం