తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vmc Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్

VMC Lands: విజయవాడలో వంద ఎకరాల కార్పొరేషన్‌ స్థలంపై పెద్దల కన్ను.. పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్

Sarath Chandra.B HT Telugu

Published Mar 20, 2025 05:00 AM IST

google News
    • VMC Lands: విజయవాడ అజిత్‌ సింగ్‌నగర్‌లో ఉన్న 110 ఎకరాల కార్పొరేషన్‌ స్థలాన్ని అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేస్తోంది. డిస్నీ ల్యాండ్ నిర్వహించిన స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 
విజయవాడలో విఎంసి డిస్నీ ల్యాండ్ స్థలాన్ని పేదలకు కేటాయించాలని సీపీఎం ఆందోళన

విజయవాడలో విఎంసి డిస్నీ ల్యాండ్ స్థలాన్ని పేదలకు కేటాయించాలని సీపీఎం ఆందోళన

VMC Lands: విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలపై బడా కంపెనీలు, పెద్దల కన్ను పడటంపై ఏపీ సీపీఎం అభ్యంతరం చెబుతోంది. సింగ్‌నగర్‌లో ఉన్న 57 ఎకరాల అజిత్ సింగ్ నగర్ డిస్నీల్యాండ్ స్థలాన్ని పేదల గృహ నిర్మాణానికి కేటాయించాలని, కూటమి ప్రభుత్వం పేదలకు రెండు సెంట్లు స్థలం, నివాసాల సమీపంలో స్థలాల కేటాయింపు హామీ నిలబెట్టుకోవాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది.


విజయవాడ నగరం మధ్యలో ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు కేటాయించాలని సీపీఎం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని 57 ఎకరాల డిస్నీల్యాండ్ స్థలాన్ని, 25 ఎకరాల రైల్వే స్థలాన్ని, మరో 25 ఎకరాల చెత్త డంపింగ్ స్థలాన్ని సిపిఎం నేతలు పరిశీలించారు.

డిస్నీల్యాండ్ లీజు ముగియడంతో ఈ స్థలం నిరుపయోగంగా ఉండి చిట్టడడవిలా మారింది. వ్యర్ధపదార్థాలతో నిండిపోయింది. చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్యానికి ప్రమాదంగా మారింది. రక్షణ కొరవడటంతో అసాంఘిక శక్తులు తిష్ట వేస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విజయవాడ సింగ్‌నగర్‌లో ఉన్న భూములు పల్లపు ప్రాంతం కావడంతో సంవత్సరం పొడుగునా మురుగునీటితో చెరువులను తలపిస్తున్నాయని స్థానిక ప్రజలు సీపీఎం బృందానికి తెలిపారు.చెత్త డంపింగ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ లో అనధికారంగా చెత్త డంపింగ్ చేస్తుండటంతో తరచూ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు గోడు వెళ్ళబోసుకున్నారుఖాళీ స్థలాలను ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని, మేలు చేయాలని స్థానికులు డిమాండ్ చేసారు

గతంలోని వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపరిచింది, రాజధానితో సహా సుదూర ప్రాంతాల్లో జగనన్న కాలనీల పేరుతో పనికిరాని స్థలాలను కేటాయించారని, కొండలు, గుట్టలు, నివాసయోగ్యం కానీ భూములలో వేసిన లేఔట్లు వృధాగా పడి ఉన్నాయని ఇళ్ల నిర్మాణాలు జరగలేదని ఆరోపించారు.

నివాసాలకు సమీపంలో అజిత్ సింగ్ నగర్ లో ప్రభుత్వ భూములు ఉంచుకుని, వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి నివాసయోగ్యం కానీ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో్ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, డిస్నీల్యాండ్ స్థలాన్ని ప్రైవేటు సంస్థలకు కబేళా కొరకు కేటాయించటానికి నగర పాలక సంస్థ కౌన్సిల్లో ఏకపక్షంగా తీర్మానం చేశారని ఆరోపించారు.

డిస్నీల్యాండ్ ఇతర ఖాళీ స్థలాలపై నేతలు, బడా సంస్థలు కన్నువేశాయని, కూటమి ప్రభుత్వం సెంటు స్థలాల స్థానంలో పేదలకు రెండు సెంట్లు స్థలం ఇళ్ల స్థలాలుగా కేటాయిస్తామని హామీ ఇచ్చిందని, సుదూర ప్రాంతాల్లో కాకుండా పేదలు కోరుకున్న విధంగా నివాసయోగ్యమైన, సమీప ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని మాట ఇచ్చారని 9 నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని ఆరోపించారు. సమీపంలో ఎక్కడ స్థలాలు కేటాయిస్తారో స్పష్టమైన ప్రకటనలు లేవని అందుకు తగ్గ ప్రణాళికలు లేవని సీపీఎం నేతలు ఆరోపించారు.

గతంలో కేటాయించిన సుదూరమైన లేఔట్లు ఏమి చేస్తారో స్పష్టత లేదని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల స్పందన కోసం ప్రజలు అద్దెదారులు ఎదురుచూస్తున్నారు, నెలలు గడుస్తున్నా స్పందన కొరవడిందని సీపీఎం నాయకుడు బాబురావు ఆరోపించారు.

కూటమి ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే, అజిత్ సింగ్ నగర్ లో ఖాళీగా ఉన్న డిస్నీల్యాండ్, రైల్వే, డంపింగ్ యార్డ్ లలో ఉన్న 110 ఎకరాల స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీ భూముల్ని గృహ నిర్మాణానికి వినియోగించాలని, కబేళా కోసం వినియోగించే తీర్మానాలను రద్దు చేయాలన్నారు.. ప్రభుత్వ భూములను పరిరక్షించాలి. పేదలు ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి. దుర్వినియోగం కాకుండా నివారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.