తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Whatsapp Governance : 'వాట్సాప్‌' ద్వారా ఏపీ ప్రభుత్వ సేవలను ఎలా పొందాలి..? ఈ వివరాలను తెలుసుకోండి

AP WhatsApp Governance : 'వాట్సాప్‌' ద్వారా ఏపీ ప్రభుత్వ సేవలను ఎలా పొందాలి..? ఈ వివరాలను తెలుసుకోండి

Published Jan 31, 2025 07:19 AM IST

google News
    • Mana Mitra Governance in Andhrapradesh: ఏపీలో సరికొత్త వ్యవస్థ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా పౌరసేవలు ప్రారంభమయ్యాయి. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు పొందవచ్చు. ఈ సరికొత్త వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి...
వాట్సాప్ ద్వారా పౌరసేవలు

వాట్సాప్ ద్వారా పౌరసేవలు

పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. జనవరి 30వ తేదీన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఈ సేవలను ప్రారంభించారు. దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 919552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.


ధ్రువపత్రాల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో వాట్సప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చింది. వాట్సాప్ ఉంటే చాలు…. 9552300009 నెంబరుపై ‘మన మిత్ర’ ద్వారా 161 పౌరసేవలు అందుకోవచ్చు. త్వరలో మరో 360 సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ సేవలను ఏ విధంగా పొందాలి..?

  • ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం మన మిత్ర’ పేరుతో సరికొత్త పద్ధతిలో సేవలను అందిస్తోంది.
  • ఈ సేవలను పొందాలనుకునేవారు ముందుగా ప్రభుత్వం ప్రకటించిన 9552300009 నెంబర్ ను మన మొబైల్ లో సేవ్ చేసుకోవాలి.
  • 9552300009 వాట్సాప్ నెంబర్ ఈ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్కు) ఉంటుంది.
  • ఈ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేయాలి. వెంటనే ఏపీ ప్రభుత్వ పౌర సేవలకు స్వాగతం అని సందేశం వస్తుంది. చివర్లో "సేవను ఎంచుకోండి" అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఈ ఆప్షన్ పై నొక్కితే ప్రభుత్వ శాఖల పేర్లు కనిపిస్తాయి. ఇందులో విద్యుత్తు, దేవాదాయ, రెవెన్యూ, పురపాలకశాఖ, ఏపీఎస్‌ఆర్టీసీ సేవలతోపాటు వినతులు స్వీకరించేందుకు వీలుగా ఆప్షన్లు డిస్ ప్లే అవుతాయి.
  • మీకు కావాల్సిన ఆప్షన్ పై నొక్కి సంబంధిత శాఖ సేవలను పొందవచ్చు.
  • 9552300009 వాట్సాప్ నెంబర్ ద్వారా 36 ప్రభుత్వ డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 161 సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇక ఈ వాట్సాప్ గవర్నెన్స్‌ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. తొలి విడతను ప్రారంభించి…161 సేవలను అందుబాటులోకి తీసుకురాగా… త్వరలోనే రెండో విడత సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. రెండో విడతలో 360 సేవలను అందుబాటులో ఉంచాలని భావిస్తోంది.

రెండో విడత వాట్సాప్ గవర్నెన్స్ కు ఏఐ టెక్నాలజీని కూడా జోడించనుంది. ప్రతి సర్టిఫికెట్ పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ తో ఎక్కడా నకిలీకి ఆస్కారం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నెంబర్ ద్వారా ఫిర్యాదు పరిష్కార సేవలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఫిర్యాదు పరిస్థితి తెలుసుకోవచ్చు. ధ్రువపత్రాలతో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి చేసిన అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునే వీలు ఉంటుంది. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను చెల్లించొచ్చు.

ప్రస్తుతం తీసుకువచ్చిన వ్యవస్థలో ఏమైనా లోటు పాట్లు ఉంటే వెంటనే సరిచేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఐటీ మంత్రి లోకేశ్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సేవలు తీసుకురాలేదన్న ఆయన… ఎంవోయూ చేసుకున్న 3 నెలల 9 రోజుల్లోనే దీనిని ప్రారంభించామని వివరించారు.