తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Dsc Recruitment : త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్.. చంద్రబాబు కీలక ప్రకటన

AP DSC RECRUITMENT : త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్.. చంద్రబాబు కీలక ప్రకటన

Published Jan 31, 2025 04:31 PM IST

google News
    • AP DSC RECRUITMENT : ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారికి సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. కూటమి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు.
ఏపీ డీఎస్సీ

ఏపీ డీఎస్సీ

త్వరలోనే 16 వేల 347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్ధేశం చేసిన చంద్రబాబు.. డీఎస్సీపై స్పష్టత ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని.. వాటిని ప్రజలకు వివరించాలని నేతలకు సూచించారు.

చంద్రబాబు ఏమన్నారు..

'ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా- గుంటూరు జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ను కూటమి అభ్యర్ధులుగా బలపరిచాం. ఫిభ్రవరి 3న నోటిఫికేషన్ వస్తుంది. 27న ఎన్నికలు, కౌంటింగ్ మార్చి 3న జరుగుతాయి. ప్రతి గ్యాడ్యుయేట్‌ను కలిసి భారీ మెజారిటీ సాధించాలి. చదువుకున్న వాళ్లంతా కూటమితోనే ఉన్నారు. ఎవరూ ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉండొద్దు. ఎన్డీయే పక్షాలతో సమన్వయ సమావేశాలు పెట్టుకుని పని చేయాలి. క్లస్టర్, యూనిట్, బూత్, ఇంచార్జ్‌లతో పాటు, జనసేన, బీజేపీ కమిటీల నేతలతో ముందుకెళ్లాలి' అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

మరింత ఆదరణ పెరుగుతుంది..

'ఈ ఎన్నికలు ఏపక్షంగా జరగాలి. ఏ ఎన్నిక వచ్చినా గెలిచినప్పుడే సుస్థిర పాలన ఉంటుంది. ప్రజల్లో మరింత ఆదరణ పెరుగుతుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పని చేయాలి. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో ఇబ్బందులు అధిగమించి సుపరిపాలన వైపు అడుగులు వేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది లేని పాలన సాగిస్తున్నాం' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

యువతకు ఉద్యోగాలు..

'రాత్రికి రాత్రి అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదు. గాడి తప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌, రాజధాని అమరావతికి ఆర్ధిక సాయం, పోలవరానికి నిధులు, రైల్వే జోన్‌తో పాటు ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. జాబ్ ఫస్ట్ విధానంతో నూతన ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపు రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం. ఈ పెట్టుబడుల ద్వారా 4,10,125 ఉద్యోగాలు మన యువతకు వస్తాయి' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

త్వరలోనే డీఎస్సీ..

'త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తున్నాం. ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మూడు పార్టీల నేతలు సార్వత్రిక ఎన్నికలకు ముందు సమన్వయంతో పని చేసినట్లుగానే.. ఇప్పుడూ అదేవిధంగా పని చేయాలి. జరిగే ప్రతి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. కూటమికి యూటీఎఫ్ మినహా మిగతా ఉపాధ్యాయ సంఘాల మద్ధతు ఉంది' అని సీఎం వివరించారు.

తదుపరి వ్యాసం