AP TET Exams: ముగిసిన ఏపీ టెట్ 2024 పరీక్షలు,ఇక డిఎస్సీ నోటిఫికేషన్ కోసమే అభ్యర్థుల నిరీక్షణ
22 October 2024, 7:33 IST
- AP TET Exams: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష 2024 ప్రశాంతంగా ముగిశాయి. 17 రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో పరీక్షల్ని నిర్వహంచారు. టెట్ పరీక్షలు పూర్తి కావడంతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.గత జులైలోనే నోటిఫికేషన్ వెలువడాల్సి ఉన్నా టెట్ కోసం వాయిదా పడింది.
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు
AP TET Exams: ఏపీ టెట్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అర్హత సాధించేందుకు లక్షలాది మంది అభ్యర్థులు గత మూడు నెలలుగా శ్రమిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వారు టీచర్ పోస్టుల కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి శ్రమిస్తున్నారు. ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ముఖ్యమంత్రి సంతకం చేయడంతో లక్షలాదిమంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. డిఎస్సీలో వీలైనంత ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు మరోసారి టెట్ పరీక్షను కూడా నిర్వహించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా చివరి రోజు అక్టోబర్ 21న ఉదయం, పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర విభాగంలో నిర్వహించారు. మధ్యాహ్నం పేపర్-2బి ప్రత్యేక విద్య విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 11877 మందికి గాను 9844 మంది అభ్యర్థులు హాజరయ్యారు. చివరిరోజు 82.88 శాతం మంది హాజరయ్యారు.
ఉదయం 38 సెంటర్లలో జరిగిన పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 9441 మందికి గాను 7886 మంది అనగా 83.53 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 17 సెంటర్లలో జరిగిన పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు 2436 మందికి గాను 1958 మంది అనగా 80.38 శాతం మంది హాజరయ్యారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్ర, పేపర్-2బి ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు మరియు ప్రాథమిక కీ అక్టోబర్ 23 నుండి వెబ్సైటులో అందుబాటులో ఉంటాయి.
ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుండి అభ్యంతరాలను అక్టోబర్ 25 వరకు టెట్ వెబ్సైటు https://aptet.apcfss.in/ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. పదిహేడు రోజుల పాటు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని, రాష్ట్ర, జిలా స్థాయి అధికారులు, విద్యుత్, రవాణా, వైద్య, పొలీసు విభాగాల అధికారులు, సాంకేతిక బృందం సమన్వయంతో పనిచేసి టెట్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించారని ఏపీ టెట్ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు.
ఫలితాలు నవంబర్ 2న విడుదల…!
ఏపీ టెట్ ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల కానున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలోనే విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్ ను నవంబరు 3న విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ‘టెట్ పరీక్షల ఫలితాలను నవంబరు 2న ప్రకటిస్తారు.
టెట్ ఫలితాలు వెలువరించిన మరుసరటి రోజే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించినా మరింత మంది అభ్యర్థులకు టెట్ అర్హతకు అవకాశం కల్పించడంలో భాగంగా తొలుత టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్ 2024 పరీక్షలు ముగిశాయి.
టెట్, మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేశారు. ఇప్పటికే ఆశావహులు కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగాలు మానుకుని పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ఉద్యోగ ప్రకటన చేసిన ఆర్నెల్లకు మించి ఆలస్యమైతే అభ్యర్థుగా భారమవుతుందని భావించారు. దీంతో నవంబర్లోనే డిఎస్సీ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు…
తాజాగా వచ్చే నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ)- 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.