Minister Lokesh : ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు - మంత్రి లోకేశ్
Updated Jun 15, 2024 06:36 PM IST
- Minister Lokesh : ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. డ్రాప్ అవుట్స్, మౌలికసదుపాయాలపై ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు.
ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు -లోకేశ్
Minister Lokesh : ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2 పనులు, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్నభోజన పథకం డైరక్టర్ అంబేద్కర్ కు లోకేశ్ సూచించారు. పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రాప్ అవుట్స్ పై వివరాలు
అదేవిధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష ఎస్పీడీని లోకేశ్ ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు. గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ ను కూడా అందజేయాలని డైరెక్టర్ లైబ్రరీస్ ను ఆదేశించారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బీ వినియోగం మీద సమగ్ర నోట్ ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్ తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82 వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోట్ ఇవ్వాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు
స్టూడెంట్ కిట్ ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని లోకేశ్ అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని లోకేశ్ ఆదేశించారు. గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకుపాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేశ్ ఆశ్చర్యానికి గురయ్యారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు. తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు.
పారదర్శకంగా టీచర్ల బదిలీలు
ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నూతన విధానాన్ని అమలుచేయనున్నారని లోకేశ్ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం అమలుచేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు. అదేవిధంగా పూర్తిస్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారుచేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.